ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఆసుపత్రి బాట పట్టబోతున్నారు. గత కొంతకాలంగా తీవ్రమైన శారీరక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఆయన, శుక్రవారం చికిత్స నిమిత్తం ముంబై వెళ్లనున్నారు. అక్కడ ప్రసిద్ధ కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ హాస్పిటల్లో ఆయనకు భుజాల శస్త్రచికిత్స జరగనుందని తెలుస్తోంది. ఇటీవలే సైనస్ సమస్యకు సర్జరీ చేయించుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు అంతలోనే మరో మేజర్ ఆపరేషన్కు సిద్ధమవ్వడం అటు రాజకీయ, ఇటు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అసలు పవన్ కళ్యాణ్(Pawan Kalyan)కు ఈ సమస్య రావడానికి దశాబ్ద కాలం నాటి పాత గాయాలే కారణమని తెలుస్తోంది. దాదాపు 15 సంవత్సరాల క్రితం 'గబ్బర్ సింగ్' సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్లో ఆయన భుజాలకు బలమైన గాయాలయ్యాయి. అప్పట్లో వరుస షూటింగులు, బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయన సరైన విశ్రాంతి తీసుకోకపోవడంతో ఆ సమస్య పూర్తిగా నయం కాలేదు. దీనికి తోడు, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన రోడ్షోలు, రాజకీయ ర్యాలీల్లో అభిమానులు ఆయన చేతులను గట్టిగా పట్టుకుని లాగడం, తోపులాటలు జరగడంతో భుజాలపై తీవ్రమైన ఒత్తిడి పడి ఆ పాత గాయాలు మళ్లీ తిరగబెట్టాయి.
వైద్యుల సమాచారం ప్రకారం.. పవన్ కళ్యాణ్ రెండు భుజాల్లోని 'రొటేటర్ కఫ్స్స తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు వైపులా ఈ కండరాలు పాక్షికంగా చీలినట్లు వైద్యులు గుర్తించారు. దీనివల్ల ఆయనకు చేతులు పైకి ఎత్తడం, కనీసం బరువులు మోయడం కూడా అత్యంత నరకంగా మారినట్లు తెలుస్తోంది. నిజానికి జూన్ చివరి వారంలోనే ఆయన ముంబై(Mumbai)లో పూర్తి స్థాయి పరీక్షలు చేయించుకోగా, వైద్యులు వెంటనే సర్జరీ చేయాలని సూచించారు. కానీ, ఏపీలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టడం, ప్రజా సమస్యల నిమిత్తం షెడ్యూల్స్ బిజీగా ఉండటంతో ఆయన వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు నొప్పి భరించలేని స్థాయికి చేరడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముంబై వెళ్తున్నారు.
ఈ శస్త్రచికిత్స నేపథ్యంలో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) దాదాపు నాలుగైదు వారాల పాటు అధికారిక సమీక్షలకు, రాజకీయ పర్యటనలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు ఏపీ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న జనసేనాని.. ఇలా వరుస సర్జరీల బారిన పడటంతో అటు జనసైనికులు, ఇటు మెగా అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని వారు ఆకాంక్షిస్తున్నారు.