ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొంతకాలంగా సాగుతున్న దుష్ప్రచారానికి ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్ శివార్లలోని ఆయన ఫామ్ హౌస్ చుట్టూ అల్లిన "కోడి చెరువు కబ్జా" కథనాలు కేవలం ఒక అజెండా ప్రకారం జరిగిన బురదజల్లుడు రాజకీయమేనని తేలిపోయింది. స్వయంగా రంగంలోకి దిగిన హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్ అందించిన అధికారిక వివరణతో పవన్ ప్రత్యర్థుల నోళ్లు ఒక్కసారిగా మూతపడ్డాయి.
అసలు వివాదం ఏమిటంటే.. పవన్ కళ్యాణ్ కోడి చెరువు(Kodi Cheruvu)ను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారని, అధికారులను బెదిరిస్తున్నారంటూ కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, జర్నలిస్టులు పెద్ద ఎత్తున రచ్చ చేశారు. రాజకీయంగా ఆయనను దెబ్బతీయడమే లక్ష్యంగా కొందరు నాయకులు సైతం ఈ అంశాన్ని నెత్తికెత్తుకుని విమర్శలు గుప్పించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను పవన్ ఏనాడో కొట్టిపారేశారు. "నేను చెరువును ఆక్రమించినట్లు ఒక్క ఆధారమైనా చూపిస్తే, ఆ భూమి మొత్తాన్ని ప్రభుత్వానికే రాసిచ్చేస్తా" అని విసిరిన సవాలు ప్రత్యర్థులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.
తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్(HYDRA Commissioner Ranganath) వెల్లడించిన నిజాలు ఆరోపణలు చేసిన వారి ముసుగులను తొలగించాయి. పవన్ కళ్యాణ్ 2014లోనే దాదాపు 10 ఎకరాల భూమిని పూర్తి చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఆ తర్వాత 2016-17 కాలంలో రీమార్కింగ్ వల్ల అందులో కొంత భాగం ఎఫ్టీఎల్ (FTL) పరిధిలోకి వచ్చిందని స్పష్టం చేశారు. చెరువుల పరిధిలో పట్టా భూములు ఉండటం సర్వసాధారణమని, అక్కడి నీటి ప్రవాహానికి పవన్ ఎలాంటి ఆటంకం కలిగించలేదని తేల్చేశారు. చెరువును పూడ్చడం కానీ, ఎలాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టడం కానీ అక్కడ జరగలేదని తెలిపారు.
పక్క భూముల యజమానులు మట్టి తోలి అక్రమ కట్టడాలు చేపడితే, పవన్ భూమిలో మాత్రం కేవలం కంచె వేయడం మినహా ఎలాంటి నిబంధనల ఉల్లంఘనా జరగలేదని అధికారులు నిర్ధారించారు. కావాలనే ఒక వర్గం సోషల్ మీడియా వేదికగా పవన్ ప్రతిష్టను దిగజార్చేందుకు ఈ అసత్య ప్రచారాన్ని నడిపించిందని ఇప్పుడు స్పష్టమవుతోంది. మరి ఇప్పటికైనా పవన్(Pawan)పై అవాకులు చవాకులు పేలిన సదరు అజెండా బ్యాచ్ క్షమాపణలు చెబుతుందో లేదో చూడాలి.