గులాబీ గూటిని వీడుతున్నారంటూ గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు బీఆర్ఎస్(BRS) సీనియర్ నేత, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తనదైన శైలిలో ఫుల్స్టాప్ పెట్టేశారు. ప్రచారంలో ఉన్నవన్నీ ఊహాగానాలేనని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాజకీయం అంటేనే ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎమోషన్ అని నిరూపించే మల్లారెడ్డి, ఈ సారి మరోసారి వార్తల్లో నిలిచారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) జన్మదిన వేడుకల్లో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్న మల్లారెడ్డి, అక్కడ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించారు. తాను బీఆర్ఎస్ను వదులుతున్నాననే ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన, అవన్నీ కట్టుకథలని కొట్టిపారేశారు. ఈ ప్రచారాన్ని నమ్మి ఒక అభిమాని తన సొంత రక్తంతో లేఖ రాయడంపై ఆయన ఎమోషనల్ అయ్యారు. త్వరలోనే ఆ అభిమానిని నేరుగా కలిసి ధైర్యం చెబుతానని మాటిచ్చారు.
ఇక కేటీఆర్కు బర్త్డే విషెస్ చెబుతూ మల్లారెడ్డి(Malla Reddy) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. "కేటీఆర్ నూరేళ్లు కాదు, 125 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి" అని ఆశీర్వదించిన ఆయన, తెలంగాణకు రాబోయే రోజుల్లో కేటీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ను సీఎం పీఠంపై చూడటమే తన ప్రధాన లక్ష్యమని చెప్పి, తన కట్టుబాటును చాటుకున్నారు. మొత్తానికి తనదైన మార్క్ పంచ్లు, ఎమోషనల్ కామెంట్స్తో పార్టీ మార్పు వార్తలకు మల్లారెడ్డి గట్టిగానే చెక్ పెట్టారు.