తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. స్టేషన్కు తరలించారు. జిల్లాలోని పరిగి మండలం లో ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేస్తోంది. దీనికిగాను.. రైతుల నుంచి భూములు సేకరిస్తున్నారు. అయితే.. ఈ విషయంలో కొందరు రైతులు.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
గత రెండు రోజులుగా పరిగిలో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములు ఇవ్వబోమని చెబుతున్నారు. దీంతో ప్రభుత్వం రైతులతో చర్చిస్తోంది. సేకరణ చట్టం ప్రకారం న్యాయం చేస్తామని అధికారులు వారిని బుజ్జగించే ప్రయత్నంలో ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా బుధవారం మధ్యాహ్నం అక్కడకు చేరుకున్న కవిత.. రైతులకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. రైతులతో కలిసి వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని.. కార్యాలయం ముందు బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
రైతుల పొట్టగొట్టి పెట్టుబడి దారులకు భూములు పందేరం చేస్తున్నారని కవిత వ్యాఖ్యానించారు. ``పారిశ్రామికీకరణ ముసుగులో రైతుల పొట్ట కొడుతున్నారు. దీనిని చూస్తూ ఊరుకునేది లేదు. భూ సేకరణను తక్షణమే నిలుపుదల చేయాలి`` అని కవిత డిమాండ్ చేశారు. అంతేకాదు.. భూసేకరణకు సంబంధించి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఇచ్చిన సేకరణ నోటిఫికేషన్ను కూడా వెనక్కితీసుకోవాలని పట్టుబట్టారు.
కవిత నిరసనకు భారీ సంఖ్యలో రైతులు తరలి వచ్చారు. అయితే.. ఈ నిరసనలకు అనుమతి లేదని పోలీసులు రంగంలోకి దిగడంతో రైతులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తొలుత రైతులను, తర్వాత కవితను పోలీసులు అరెస్టు. చేశారు.
బీఆర్ ఎస్ కంటే ముందే..
కాగా.. ఇటీవల కాలంలో కవిత దూకుడు పెంచారు. ఇలాంటి భూముల సమస్యలు తెరమీదికి వచ్చినప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ పార్టీ కంటే ముందే ఆమె స్పందిస్తున్నారు. ఖమ్మంలో ఇటీవల పేదల ఇళ్లు పడగొట్టారన్న చర్చ తెరమీదికి రాగానే..అక్కడకు వెళ్లి నిరసన తెలిపారు. తాజాగా వికారాబాద్ సమస్యపైనా హుటాహుటిన స్పందించడం గమనార్హం.