ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్లో జాతీయ జెండాను ఎగురవేసి, జాతి నిర్మాణంలో మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఎం.డి. శ్రీ చంద్రశేఖర్ ఆజాద్, సీఈఓ శ్రీ నాగసాయిలతో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ జెండాకు వందనం చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె. బుచ్చి రామ్ ప్రసాద్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం అనేది మనకు లభించిన హక్కు మాత్రమే కాకుండా, దేశ అభివృద్ధి కోసం ప్రతి పౌరుడిపై ఉన్న బాధ్యతను గుర్తు చేసే మహత్తరమైన సందర్భమని అన్నారు. దేశ సమగ్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
బ్రాహ్మణ సమాజ సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి, యువతకు అవకాశాల కల్పనతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా కార్పొరేషన్ నిరంతరం కృషి చేస్తుందని, జైహింద్.. జై భారత్ అని ఆయన తెలిపారు.